కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?
చర్యలపై పునరాలోచన.. సురేఖకు పలువురు కీలక నేతల మద్దతు
హైదరాబాద్ | Ntoday News
మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలపై పునరాలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేఖపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా ముందస్తు రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించినట్లు సమాచారం.
సురేఖకు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక అగ్రనేత మద్దతుగా నిలిచినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సురేఖపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మరో ఏఐసీసీ కార్యదర్శి పార్టీ అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది.
ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని సదరు నేత హెచ్చరించినట్లు సమాచారం. ఒకవేళ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆమె రాజీనామా చేసే అవకాశం ఉందని, అదే జరిగితే ఉప ఎన్నిక అనివార్యమై రాష్ట్రంలో పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు నేతలు అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్కు తమ అభిప్రాయాలను తెలియజేసిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు.. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొండా సురేఖతో సంప్రదింపులు జరపాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు సురేఖకు పార్టీలో మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో, ఆమెపై చర్యలు తీసుకుంటే బీసీ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ పరిణామాలతో కొండా సురేఖ విషయంలో అధిష్టానం వెనకడుగు వేస్తుందా? లేక గతంలో అనుకున్నట్లుగానే చర్యలు కొనసాగిస్తుందా? అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో సురేఖకు పెరుగుతున్న మద్దతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంలోనూ రాజకీయంగా చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.
గమనిక: పై కథనంలోని అంశాలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, సమాచారం ఆధారంగా పేర్కొనబడినవి. అధికారికంగా ధృవీకరించిన నిర్ణయంగా పరిగణించరాదు.