కోతులు, వీధి కుక్కల బెడదపై బీఆర్ఎస్ ధర్నా
కోతులు, వీధి కుక్కల బెడదపై బీఆర్ఎస్ ధర్నా
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ శ్రుతిమించుతున్న కోతులు, వీధికుక్కల బెడదను తక్షణమే నివారించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన వీధుల్లో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వీధికుక్కల సంఖ్య గణనీయంగా పెరగడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వందలాది మంది కోతులు, కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలవుతున్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోతులను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించడంలోనూ, కుక్కల సంతతి నియంత్రణకు అవసరమైన శస్త్రచికిత్సలు చేపట్టడంలోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కోతులు, వీధి కుక్కల దాడుల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వం వెంటనే ఉచిత వైద్య చికిత్సతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలి. స్థానికుల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలి డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలను మమేకం చేస్తూ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, కౌన్సిలర్లు నిమ్మనగోటి శ్రీనివాస్ (10వ వార్డు), ఎస్కే షబానా అజీముద్దీన్ (2వ వార్డు), 9వ వార్డు ఇంచార్జ్ ఆగు అశోక్ యాదవ్ పాల్గొన్నారు.