కృష్ణమ్మ వెలవెల.. ప్రాణహితకు జలకళ
వరదలు లేక ఆయకట్టు రైతుల్లో ఆందోళన.. గతేడాది మేలోనే జూరాలకు వరద, ఈసారి ఇంకా జాడలేదు
గద్వాల/కాగజ్నగర్: ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేకపోవడంతో కృష్ణానది వెలవెలబోతోంది. జూరాల ప్రాజెక్టు దిగువన ఇసుక దిబ్బలు, రాళ్లు బయటపడటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుండగా, కృష్ణానదికి మాత్రం ఇప్పటివరకు గణనీయమైన వరద రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గతేడాది మే 27 నుంచే జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైంది. అప్పటివరకు 3.2 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ మే 29 నాటికి 7.78 టీఎంసీలకు చేరింది. అదే రోజు రాత్రి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో నమోదవడంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.
అలాగే 2025 మే 29 నుంచే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం ప్రారంభమైంది. అప్పటివరకు 39 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ జూన్ 3 నాటికి 70 టీఎంసీలకు పెరిగింది. దీంతో జూన్ మొదటి వారంలోనే అధికారులు వివిధ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. జూరాల పరిధిలోని భీమా లిఫ్ట్-1, లిఫ్ట్-2, కోయిల్సాగర్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, ఆర్డీఎస్ ప్యారలల్ కెనాల్స్కు నీటిని విడుదల చేశారు.
అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటికే ఏరువాక ప్రారంభమైనప్పటికీ కృష్ణానదికి వరదలు రాకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.