ఉద్యోగ భద్రత కరువు.. కార్మికుల జీవితాలు అభద్రత అంచుల్లో
భద్రత లేని బతుకులు ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల నేపథ్యంలో దేశ కార్మిక రంగంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు శాశ్వత ఉద్యోగాలు కార్మికులకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, కుటుంబ స్థిరత్వాన్ని కల్పించేవి. కానీ నేడు ఫిక్స్డ్ టర్మ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, క్యాజువల్ వంటి నాన్ రెగ్యులర్ ఉద్యోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు ఈ విధానాలను ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగా యాజమాన్యాలకు లాభాలు పెరుగుతుండగా, కార్మిక వర్గం తీవ్ర శ్రమదోపిడీ, అభద్రతను ఎదుర్కొంటోంది.
తెలంగాణ ఫ్యాక్టరీల శాఖ గణాంకాల ప్రకారం 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 10,368 పరిశ్రమలు ఉండగా, వాటిలో 8.37 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 83 శాతం మంది కాంట్రాక్ట్, నాన్ రెగ్యులర్ కార్మికులే. కేవలం 17 శాతం మంది మాత్రమే శాశ్వత ఉద్యోగాల్లో ఉన్నారు. శాశ్వత ఉద్యోగులు చేసే పనినే చేస్తున్నప్పటికీ, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ, ఇతర చట్టబద్ధ హక్కులు అందడం లేదు.
తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవడం, స్టైఫండ్ పేరిట శాశ్వత ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక నియామకాలు చేపట్టడం, కార్మిక హక్కులను కాలరాయడం ఇప్పుడు సాధారణంగా మారింది. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, ప్రీమియర్ ఎక్స్ప్లోజీవ్, ముర్గుల గ్లాస్, మంగళా ట్యూబ్, మహీంద్రా ట్రాక్టర్స్ వంటి అనేక సంస్థల్లో కార్మికులు మరణాలు, గాయాలకు గురయ్యారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి.
గ్లోబల్ సిటీ, స్మార్ట్ సిటీ పేర్లతో భారీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, కార్మికుల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడటం లేదు. ఎన్నికల హామీలు అమలు కాకపోవడం, కార్మిక సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది. షాహి ఎక్స్పోర్ట్స్, హెచ్బీఎల్, బిస్లరీ వంటి సంస్థల్లో కార్మికులు పోరాటాల బాట పట్టడం దీనికి నిదర్శనం. మహిళా కార్మికులు తక్కువ వేతనాలు, అధిక పనిభారం, లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.
నాలుగు లేబర్ కోడ్స్ అమలుతో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగ విధానం మరింత విస్తరించింది. ఒప్పంద కాలం పూర్తయిన వెంటనే ఉద్యోగం ముగుస్తుండటంతో కార్మికులు నిరంతర భయాందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం కేవలం ఉపాధి సమస్య మాత్రమే కాదు; అది కుటుంబ ఆర్థిక స్థిరత్వం, పిల్లల విద్య, వైద్యం, వృద్ధాప్య భద్రత, గౌరవప్రదమైన జీవన హక్కుతో ముడిపడి ఉంది.
ఉద్యోగం కోల్పోతామనే భయంతో అనేక మంది కార్మికులు కనీస వేతనం, పని గంటలు, భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధ హక్కుల కోసం కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కార్మికుల సంఘటిత శక్తిని బలహీనపరుస్తూ యాజమాన్యాల దోపిడీకి మరింత అవకాశం కల్పిస్తోంది.
అయితే చరిత్ర చెబుతున్న సత్యం ఒక్కటే. హక్కులు ఎవ్వరూ దానం చేయరు. ఐక్యతతో కూడిన పోరాటాల ద్వారానే సాధించుకోవాలి. దేశ సంపదను సృష్టించే కార్మిక వర్గం తన శ్రమ విలువను గుర్తించి, ఉద్యోగ భద్రత, సమాన హక్కులు, గౌరవప్రద జీవనం కోసం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో మరింత పెరిగింది.