గుట్కా ఉమ్మబోయి ప్రాణం కోల్పోయిన ప్రయాణికుడు.. కిటికీలోంచి తల బయటపెట్టడం ఘోరాంతం
ఓ చిన్న నిర్లక్ష్యం, కేవలం ఐదు రూపాయల గుట్కా కోసం చేసిన పొరపాటు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
జాతీయ రహదారిపై నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (ఎన్డబ్ల్యూకేఆర్టీసీ) బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు గుట్కా నములుతూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత నోటిలోని గుట్కాను ఉమ్మివేయాలనే ఉద్దేశంతో బస్సు కిటికీలోంచి తలను బయటకు పెట్టాడు.
అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న మరో వాహనం బస్సుకు అతి సమీపంగా దూసుకెళ్లడంతో ఆ ప్రయాణికుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కొంతదూరం వరకు రోడ్డంతా రక్తంతో తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒక కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి, కేవలం ఒక చెడు వ్యసనం కారణంగా గమ్యానికి చేరకముందే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో "ఐదు రూపాయల గుట్కా ప్రాణం తీసింది" అనే శీర్షికతో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటన మరోసారి ప్రయాణ సమయంలో కిటికీల్లోంచి తలలు, చేతులు బయటకు పెట్టడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసింది.