పసిఫిక్ భయపెడితే.. బంగాళాఖాతం అభయమిచ్చింది!
మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల సూచన
హైదరాబాద్, జూలై 3: మొన్నటి వరకు మండుటెండలతో అల్లాడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎట్టకేలకు ప్రకృతి శుభవార్త అందించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నీనో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షాలు కురవకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరి నారుమడులు ఎండిపోకుండా కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి తడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే తాజాగా వాయువ్య బంగాళాఖాతానికి సమీపంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముండటంతో వచ్చే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలు, ఉత్తర కోస్తా, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శుక్రవారం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా, పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి.
అల్పపీడనం ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. విద్యుత్ వినియోగం కూడా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఆశాకిరణంగా మారింది.