జులై 16, 17, 18 తేదీల్లో 'తల్లికి వందనం' డబ్బులు జమ: మంత్రి లోకేశ్
అమరావతి, జులై 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద రెండో విడత నిధులను జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్లు నిర్వహించి, అదే సమయంలో నిధుల విడుదల ప్రక్రియ చేపడతామని తెలిపారు.
విద్యాభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది తల్లులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా, జులై 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల అమలుపై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని మంత్రి లోకేశ్ సూచించారు.