కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బలివాడ కాంతారావు జయంతి ఘనంగా నిర్వహణ
గంపలగూడెం, జూలై 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బలివాడ కాంతారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరసవెల్లి అనూష మాట్లాడుతూ బలివాడ కాంతారావు తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన మహోన్నత రచయిత అని పేర్కొన్నారు. ఆయన 38 నవలలు, 400కు పైగా చిన్నకథలు, 8 నాటకాలు, యాత్ర కథనాలు, వ్యాసాలు రచించి తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు.
అలాగే ఆయన రచించిన "పుణ్యభూమి" నవలకు 1972లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని, "బలివాడ కాంతారావు కథలు" కథా సంకలనానికి 1988లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కిందని చెప్పారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు లభించాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, సీఆర్పీ సంగెపు చిన్న నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.