ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగానికి స్వస్తి పలకాలి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో "అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సభలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ సంచులు భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుందని, వాటిని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ను కాల్చడం వల్ల వెలువడే విషవాయువులు గాలి కాలుష్యానికి కారణమై ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి, బట్ట సంచులు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఎస్. రామలక్ష్మి, జి. ఆదిలక్ష్మి, అంగన్వాడీ సహాయకురాలు దేవర అంజలి, గ్రామస్తులు పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.