తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. నేటి నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 3: నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింత విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై 3 నుంచి 8వ తేదీ వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ముఖ్యంగా జూలై 3, 4 తేదీల్లో ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.
అలాగే జూలై 4, 5 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
జూలై 5 నుంచి 8వ తేదీ వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.