రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న ఆదేశం
చాట్రాయి, జులై 3: రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధం కావాలని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రీ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 60 శాతానికి పైగా ప్రక్రియ పూర్తయిన రైతుల జాబితాను సిద్ధం చేసి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జులై నెలలోనే రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి నిర్లక్ష్యం లేదా ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.
ఈ సమావేశంలో తహసీల్దార్ శ్వేత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.