ఒంగోలులో దారుణం.. సెలూన్లోనే నాయిబ్రాహ్మణ యువకుడి హత్య
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సాగర్ లాడ్జ్ సమీపంలోని మస్తాన్ హోటల్ పక్కన ఉన్న శ్రీనివాస హెయిర్ స్టైల్ సెలూన్లో విధులు నిర్వహిస్తున్న ఓ నాయిబ్రాహ్మణ యువకుడిని ఓ వ్యక్తి కత్తెరతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం, సాయంత్రం సమయంలో షేవింగ్ చేయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. అతని పరిస్థితిని గమనించిన సెలూన్ నిర్వాహకుడు ఆ స్థితిలో షేవింగ్ చేయడం కుదరదని నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి యువకుడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కోపోద్రిక్తుడైన దుండగుడు షాపులో ఉన్న కత్తెరను తీసుకుని యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడిపోయిన యువకుడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనను ధన్వంతరి నాయిబ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేయడం అమానుషమని పేర్కొంది. హత్యకు పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని సమాఖ్య డిమాండ్ చేసింది. అలాగే కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న యువకుడిని కోల్పోయిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించి, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరింది. సమాజానికి సేవలందించే నాయిబ్రాహ్మణ వృత్తిదారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ కేసును ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ధన్వంతరి నాయిబ్రాహ్మణ సమాఖ్య హెచ్చరించింది.