IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,715 ఖాళీలను భర్తీ చేయనుంది. దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు జులై 1 నుంచి జులై 21, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర దశలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉండగా, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 4న జరగనుంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.