నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసిన భార్య.. రుణభారం నుంచి బయటపడేందుకే హత్యాయత్నం!
తమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త చనిపోతే అప్పుల ఒత్తిడి నుంచి బయటపడవచ్చని భావించిన ఓ మహిళ, తన సొంత భర్తను హత్య చేసేందుకు పథకం రచించింది. నిద్రలో ఉన్న సమయంలో అతడి చెవిలో విషం పోసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే బాధితుడు అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువిడైమరుదూర్ తాలూకా పుళుదికుడి గ్రామానికి చెందిన కూలీ రవిచంద్రన్ (54), ఉమారాణి (48) దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెకు వివాహం జరిగింది.
కొత్త ఇంటి నిర్మాణం కోసం రవిచంద్రన్ వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు రుణం తీసుకున్నాడు. అప్పులు తీర్చలేకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భర్త మరణిస్తే రుణదాతల ఒత్తిళ్లు ఉండవని భావించిన ఉమారాణి, తన తమ్ముడు జ్ఞానశేఖరన్ (35)తో కలిసి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.
మంగళవారం రాత్రి రవిచంద్రన్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఉమారాణి, జ్ఞానశేఖరన్ కలిసి అతడి చెవిలో విషం పోశారు. ఒక్కసారిగా మేల్కొన్న రవిచంద్రన్ వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి స్థానికుల సహాయంతో కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు తిరువిడైమరుదూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఉమారాణి, జ్ఞానశేఖరన్ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో మూడు నెలల క్రితమే టీలో విషం కలిపి రవిచంద్రన్ను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు బయటపడింది. ఆ ఘటన తర్వాత అప్రమత్తమైన రవిచంద్రన్ ఇంట్లో ఎవరూ ఇచ్చిన ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం తంజావూరు జైలుకు తరలించారు.