ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి: మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు, జూలై 2: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
గురువారం నూజివీడులో సబ్ కలెక్టర్ బి. వినూత్న, నియోజకవర్గ తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో మంత్రి వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలులో కొంత జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. బీఎల్వోలు, బీఎల్ఏలు డిజిటలైజేషన్, ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిజిటలైజేషన్ ఆలస్యానికి గల కారణాలను గుర్తించి అవసరమైతే అదనపు సిబ్బంది, సాంకేతిక సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమావేశంలో వివాహం అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు కొత్త ఓటరు నమోదు ఎలా చేసుకోవాలి, తల్లిదండ్రుల ఇంటి ఓటును ఎలా తొలగించాలనే అంశంపై మంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు స్పందిస్తూ, కొత్త చిరునామాలో ఓటరు నమోదు పూర్తయిన అనంతరం పాత చిరునామాలోని ఓటును తొలగించే ప్రక్రియ ఉంటుందని వివరించారు.
వచ్చే నెల 14వ తేదీ వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతుందని, అనంతరం ఓటరు జాబితాలోని పేర్లు, చిరునామాలు, ఇతర తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుందని సబ్ కలెక్టర్ బి. వినూత్న తెలిపారు.
డిజిటలైజేషన్ కాని ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పిస్తే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆన్లైన్ నమోదు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వీఆర్వోలు, బీఎల్వోలు, బీఎల్ఏలు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో పనిచేసి కొత్త ఓటర్ల నమోదును పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఏ ఒక్క అర్హుడైన ఓటరు జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. అలాగే మరణించిన వారి పేర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి. వినూత్న, నియోజకవర్గ తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.