ఏ పోలవరం రైతులకు రాజముద్ర పాసు పుస్తకాల పంపిణీ
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
రైతుల చేతికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం, జూలై 2: జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలో రైతులకు గురువారం కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ రైతులకు రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రీ సర్వే ప్రక్రియ ద్వారా భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దిన అనంతరం రైతులకు పారదర్శకంగా కొత్త పాసు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ఫోటోలతో పాసు పుస్తకాలు జారీ చేయగా, ప్రస్తుతం ఎటువంటి వ్యక్తుల ఫోటోలు లేకుండా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోందని పేర్కొన్నారు.
రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడం, బ్యాంకు రుణాలు పొందడంలో సౌలభ్యం కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళనతో భవిష్యత్తులో భూ వివాదాలకు చెక్ పడుతుందని ఆయన అన్నారు.
కొత్త పాసు పుస్తకాలు అందుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.