తిరువూరులో డెంగ్యూ మాసోత్సవ ర్యాలీ నిర్వహణ
తిరువూరు, జూలై 2: స్థానిక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సి) ఆధ్వర్యంలో గురువారం డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యూపీహెచ్సి ఇన్చార్జి వైద్యాధికారిణి డాక్టర్ జె. సాయి భవ్య సుధ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు నిల్వ నీటిలో ఎక్కువగా వృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారానికి కనీసం ఒకసారి వాటిని శుభ్రపరచాలని సూచించారు.
డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ వైద్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్.కె. బాబావలి, హెల్త్ సూపర్వైజర్ కె. రవి, హెల్త్ విజిటర్ శ్యామల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.