బెంగళూరు సమీపంలో ఘోర విషాదం.. బండరాయి కింద నలిగి 8 మంది కూలీలు మృతి
బెంగళూరు, జులై 3: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం ఎనిమిది మంది అమాయక కూలీల ప్రాణాలను బలిగొంది. బెంగళూరు దక్షిణ తాలూకా మాద పట్టణం సమీపంలోని ఓ రాతి క్వారీలో ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య భారీ బండరాయి ఒక్కసారిగా దొర్లి కార్మికులపై పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో క్వారీలో 18 మందికిపైగా కూలీలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 40 అడుగుల ఎత్తులో ఉన్న భారీ బండరాయి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చి కూలీలపై పడింది. బండరాయి కింద నలిగిపోయిన ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో సహాయక సిబ్బంది గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
మృతులంతా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీల ప్రాణాలకు భద్రత కల్పించడం క్వారీ యజమానుల బాధ్యత అని పేర్కొంటూ, నిబంధనలను ఉల్లంఘించే క్వారీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్వారీ నిర్వహణలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరిగిందా? నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. బ్లాస్టింగ్ పనుల వల్ల ప్రకంపనలు ఏర్పడి బండరాయి కూలిపోయిందని క్రషర్ నిర్వాహకుడు చెబుతుండగా, ఆ బండరాయి అస్థిరంగా ఉందని ముందుగానే హెచ్చరించినా నిర్వాహకులు పట్టించుకోలేదని కొందరు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన మరోసారి క్వారీల్లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.