సర్ కార్యక్రమంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: సబ్ కలెక్టర్ వినూత్న
చాట్రాయి, జూలై 2 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఇందులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న హెచ్చరించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
సర్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈ నెల 14వ తేదీలోగా పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మండలంలో ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే సర్వే పూర్తికావడంపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రతిరోజూ పురోగతి నివేదికలను అందజేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా కీలకమని, ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. రాజు, తహసీల్దార్ శ్వేత, బీఎల్వోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.