ప్రగడవరం గ్రామంలో 20 రోజులుగా నీటి లీకేజీ.. మొరపెట్టుకున్నా పట్టించుకోని పంచాయతీ అధికారులు!
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ప్రగడవరం గ్రామంలో అధికారుల నిర్లక్ష్యానికి దుర్వాసనతో అల్లాడుతున్న యాదవ నగర్ ప్రజలు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని యాదవ నగర్ కాలనీలో గత 20 రోజులుగా పంచాయతీ తాగునీటి పైప్లైన్ లీకేజీ అవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా నీరు వృథా కావడంతో పాటు గౌడ బజార్ మీదుగా రోడ్డంతా నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.
సమస్యపై పలుమార్లు పంచాయతీ సెక్రెటరీకి ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డుపై నిల్వ ఉన్న నీటితో దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రరూపం దాల్చినా అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేకపోతే పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని యాదవ నగర్ కాలనీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.