క్షణాల్లో టోల్ ప్లాజాను దగ్ధం చేసిన ఎల్పీజీ ట్యాంకర్.. భయానక దృశ్యాలు సీసీటీవీలో బంధం
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి టోల్ ప్లాజా వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టోల్ ప్లాజా సమీపానికి చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్లో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో క్షణాల్లోనే భారీ మంటలు చెలరేగాయి. లీకైన గ్యాస్ వేగంగా వ్యాపించడంతో ట్యాంకర్ అగ్నిగోళంగా మారి, మంటలు టోల్ ప్లాజా ప్రాంగణమంతా చుట్టుముట్టాయి.
మంటల తీవ్రతకు టోల్ బూత్లు, పరిసర ప్రాంతం పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. టోల్ ప్లాజా సిబ్బందితో పాటు అక్కడ ఉన్న వాహనదారులు, డ్రైవర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు ఎగసిపడిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.