గుజరాత్లో అన్నదాత కన్నెర్ర.. బీజేపీ ప్రభుత్వానికి రైతు ఉద్యమాల సెగ
గాంధీనగర్, జూలై 4 గుజరాత్లో రైతు ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. వ్యవసాయ భూముల్లో విద్యుత్ స్తంభాలు, హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం నుంచి గుజరాత్ రైతులను సంవత్సరాలుగా దూరం పెట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ రెండు అంశాలు కలిసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతు అసంతృప్తికి దారితీశాయి. క్షేత్రస్థాయిలో అన్నదాతల్లో పెరుగుతున్న ఆగ్రహం బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది.
గుజరాత్లోని కచ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ సహా అనేక జిల్లాల్లో విద్యుత్ కంపెనీలు పొలాల మీదుగా హైటెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్లు, భారీ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నాయి. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తరలించేందుకు ఈ ట్రాన్స్మిషన్ కారిడార్లను నిర్మిస్తున్నారు. ఒకసారి విద్యుత్ స్తంభం ఏర్పాటు అయితే ఆ భూమి శాశ్వతంగా వ్యవసాయానికి అనుకూలంగా ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగల కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడపడం కష్టమవుతోందని, దీంతో భూమి ఉత్పాదకతతో పాటు మార్కెట్ విలువ కూడా తగ్గిపోతోందని చెబుతున్నారు.
ప్రస్తుతం గుజరాత్లో దాదాపు 20 జిల్లాల్లో 500 కిలోమీటర్ల మేర 100 హై-వోల్టేజ్ విద్యుత్ కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. 135 గిగావాట్ల విద్యుత్ ప్రసార ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 5.5 లక్షల రైతు కుటుంబాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 3,800 హెక్టార్ల వ్యవసాయ భూమి నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే 14 జిల్లాల్లో రైతులకు నోటీసులు జారీ చేయగా, ఆరు జిల్లాల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
రైతు ఉద్యమానికి బలం చేకూర్చుతూ జూన్ 15న కిసాన్ కాంగ్రెస్, కిసాన్ సంఘర్ష్ సమితి సంయుక్త ఆధ్వర్యంలో శాంతిపుర సర్కిల్ నుంచి గాంధీనగర్ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సూరత్, మోర్బి, రాజ్కోట్, సురేంద్రనగర్, భావ్నగర్, కచ్, ఉత్తర గుజరాత్ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అదానీ సహా పలు కంపెనీలు బలవంతంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నాయని రైతు నాయకులు ఆరోపించారు. నిరసన తెలిపే రైతులపై పోలీసులు దాడులు చేస్తున్నారని కూడా విమర్శించారు.
భూసేకరణ చట్టం-2013 ప్రకారం తమ భూమికి మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు పరిహారం, ప్రతి విద్యుత్ స్తంభానికి నెలకు రూ.50 వేల అద్దె, ఒక్కో స్తంభానికి రూ.2 కోట్ల చొప్పున ఒకేసారి చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రత్యేక రైతు సదస్సులు నిర్వహించి ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.
రైతు నిరసనల తీవ్రత రాష్ట్ర మంత్రివర్గాన్ని కూడా కదిలించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతులకు ప్రస్తుతం అందిస్తున్న దానికంటే అధిక నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అయితే కొత్త పరిహార విధానం ఇంకా ప్రకటించలేదు. రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో రైతు నాయకులు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విద్యుత్ ప్రసార లైన్లకు సంబంధించిన నోటీసుల్లో ప్రభావిత రైతుల పేర్లు, భూముల సర్వే నంబర్లు తప్పనిసరిగా పేర్కొనేలా కేంద్ర నిబంధనలు మార్చాలని కోరారు. ప్రస్తుతం గ్రామాల పేర్లతో మాత్రమే నోటీసులు జారీ చేయడం వల్ల అధికారులు, కంపెనీలు రైతుల అనుమతి లేకుండానే పనులు ప్రారంభిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
"భూమి మాది.. ఆదాయం కంపెనీలకా?" అని ప్రశ్నిస్తున్న రైతులు, ఒకసారి ఇచ్చే పరిహారం తమకు కలిగే శాశ్వత నష్టానికి ఏమాత్రం సరిపోదని అంటున్నారు. దశాబ్దాల పాటు విద్యుత్ కంపెనీలు తమ భూములపై నిర్మించిన మౌలిక సదుపాయాల ద్వారా ఆదాయం పొందుతున్నప్పుడు, భూమి యజమానులైన రైతులకు ఎందుకు తగిన వాటా ఇవ్వకూడదని ప్రశ్నిస్తున్నారు. నష్టపరిహార విధానాన్ని పూర్తిగా పునర్విమర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతు నాయకులు భరత్సింగ్ ఝాలా, విజయభాయ్ ఉగ్రేజా, నరేష్ పటేల్ నేతృత్వంలో జెట్పూర్, మోతీ మరద్ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ నిరసనల జ్వాల ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. జిల్లా కలెక్టర్ సమావేశాన్ని 22 గ్రామాల సర్పంచులు బహిష్కరించడం, స్థానిక బీజేపీ నాయకులు గ్రామస్థుల వ్యతిరేకతను ఎదుర్కోవడం గుజరాత్లో రైతు అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది.