నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
తిరుమల, జూలై 3: తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా బుక్ చేసి, గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య టీటీడీ విజిలెన్స్ అందించిన సమాచారంతో చేపట్టారు.
జూలై 2న సి.ఆర్.ఓ. కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. వారిని విచారించగా మొబైల్ యాప్ల సహాయంతో నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి టీటీడీ గదులను పొందడం, అనంతరం వాటిని రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. వారి సమాచారంతో మరో నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన వారిలో తెలంగాణకు చెందిన ఎం. వేణుగోపాల్, టి. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన దొంత రవీంద్రబాబు, ఉత్తరప్రదేశ్కు చెందిన సంతోష్ కుమార్ ఉన్నారు. వారి వద్ద నుంచి రెండు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు, 12 నకిలీ ఆధార్ కార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో ఈ ముఠా గత కొంతకాలంగా నకిలీ ఆధార్ కార్డుల ద్వారా టీటీడీ గదులను అక్రమంగా పొందుతూ శ్రీవారి భక్తులను, టీటీడీని మోసం చేస్తున్నట్లు తేలింది. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ అక్రమ దందాను ఛేదించిన తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ అభినందించారు.
ఇదిలా ఉండగా, టీటీడీ వసతి గదులను అధికారిక కౌంటర్లు లేదా అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారానే పొందాలని, దళారులు లేదా మధ్యవర్తులను ఆశ్రయించవద్దని శ్రీవారి భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే తిరుమల పోలీసులు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భక్తులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు