సమరశీల పోరాటాలతోనే రైతు భవిష్యత్తు ఏలూరు రైతు మహాసభలో నేతల పిలుపు
సమరశీల పోరాటాలతోనే భవిష్యత్తు పన్నెండేళ్ల మోడీ పాలనలో రైతు మనుగడ ప్రశ్నార్థకం అదే బాటలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం : ఏలూరులో ఎపి రైతు సంఘం మహాసభలో నేతల పిలుపు
ఏలూరు, జులై 4 (ప్రజాశక్తి): సమరశీల పోరాటాలతోనే రైతు రక్షణ, వ్యవసాయ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎపి రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జులై 3 నుంచి 5 వరకు ఏలూరులో జరుగుతున్న సందర్భంగా శుక్రవారం జూట్మిల్లు సెంటర్ నుంచి కలెక్టరేట్ సమీపంలోని రుద్రరాజు సత్యనారాయణ-ఆర్ఎస్ నగర్ సభా ప్రాంగణం వరకు భారీ కర్షక ర్యాలీ నిర్వహించారు. "హలో రైతన్నా.. చలో ఏలూరు" నినాదాలతో రైతులు కదం తొక్కారు. అనంతరం ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది.
అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ 2014లో రైతులకు మంచి రోజులు తీసుకొస్తామని హామీలు ఇచ్చిన నరేంద్ర మోడీ పాలనలో ప్రస్తుతం రైతులు సేద్యం చేయలేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత పన్నెండేళ్లలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీలను కలిపితే ఆ సంఖ్య పది లక్షలకు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు భారత రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని, విదేశీ ఉత్పత్తులు దేశంలోకి భారీగా వస్తే ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు భూములు ధారాదత్తం చేస్తుంటే రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విజ్జూ కృష్ణన్ ఆరోపించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కార్పొరేట్ పక్షపాతానికి నిదర్శనమన్నారు. ఇతర రాష్ట్రాల్లో 45 నుంచి 60 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మిస్తుండగా ఇక్కడ 250 మీటర్ల వెడల్పుతో నిర్మించడం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలే ఉన్నాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారని, ఎక్కడా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదని అన్నారు.
రైతుల సమస్యలపై అఖిల భారత కిసాన్ సభ ఏర్పడిన నాటి నుంచే పోరాటం చేస్తోందని పేర్కొన్న ఆయన ప్రస్తుతం రైతుల ముందు చావడమా, చివరి వరకు పోరాడటమా అనే రెండు మార్గాలే ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు కోసం ఐక్య, సమరశీల పోరాటాలకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఏ రైతూ సంతోషంగా లేడని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి అన్నారు. కనీస మద్దతు ధరలకు ప్రభుత్వాలు పంటలను కొనుగోలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లోనే నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ భూదాహం, భూకబ్జాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఉచిత పంటల బీమా అమలు చేయాలని, సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పిన టిడిపి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిందేమీ లేదని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం విమర్శించారు. కౌలు రైతుల విషయంలో మాటలు తప్ప చేతల్లో ఏమీ కనిపించడం లేదన్నారు. డెల్టా ప్రాంతాల్లో అత్యధికంగా సన్న, చిన్న, పేద, కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు అండగా నిలవాలని కోరారు.
సభలో ఎఐకెఎస్ సహాయ కార్యదర్శి టి.సాగర్, రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ, సీనియర్ నాయకుడు వై.కేశవరావు, నిర్వాసితుల సంఘం నాయకుడు మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించగా, మహాసభల ఆహ్వాన సంఘం నాయకుడు ఆర్.లింగరాజు వందన సమర్పణ చేశారు. ప్రజా నాట్యమండలి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.