ఉగ్రరూపం దాల్చనున్న ఎల్నినో.. భారత్కు కరువు ముప్పు
న్యూఢిల్లీ, జూలై 3: ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఎల్నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని, జూలై నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో అవి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రపంచ దేశాలు తీవ్రమైన వాతావరణ మార్పులు, కరువు, అతివృష్టి, వేడిగాలులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
డబ్ల్యూఎంవో అంచనాల ప్రకారం కీలక సముద్ర ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చు. ఉత్తరార్ధగోళంలో శరదృతువులో ఎల్నినో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో దుర్భిక్షం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, సముద్రాలు, భూభాగాలపై తీవ్ర వేడిగాలులు వీచే పరిస్థితులు నెలకొంటాయని డబ్ల్యూఎంవో చీఫ్ సెలెస్టీ సాలో తెలిపారు.
భారత్ ఉపఖండం, ఆస్ట్రేలియాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముండగా, నైరుతి అమెరికాలో మాత్రం అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.
భారత్లో వర్షాల తీవ్ర వైరుధ్యం
దేశంలో ఒకవైపు కరువు ఛాయలు కమ్ముకుంటుండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మేఘ విస్పోటం తరహా వర్షాలు, వరదలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 1 వరకు దేశవ్యాప్తంగా సాధారణ సగటు 172.9 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా, కేవలం 108.1 మిల్లీమీటర్ల వర్షమే నమోదైంది. దీంతో 37.5 శాతం వర్షపాత లోటు ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశంలోని 29 రాష్ట్రాల పరిధిలో 79 శాతం భూభాగం లోటు లేదా తీవ్ర లోటు వర్షపాత ప్రాంతాలుగా నమోదైంది. ఐఎండీ పర్యవేక్షణలోని 741 జిల్లాల్లో 535 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుండగా, కేవలం 201 జిల్లాల్లో మాత్రమే సాధారణం లేదా అధిక వర్షపాతం నమోదైంది.
కరువు భయంతో రైతుల్లో ఆందోళన
వర్షాలు కురవకపోవడంతో సాగునీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. చెరువులు, రిజర్వాయర్లు అడుగంటిపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాలు మందగించే ప్రమాదం కనిపిస్తోంది.
లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.