లింగపాలెం జడ్పీ హైస్కూల్లో పోలీసుల అవగాహన సదస్సు
లింగపాలెం: విద్యార్థులకు అత్యవసర టోల్ఫ్రీ నంబర్లు, రహదారి భద్రతపై ధర్మాజీగూడెం పోలీసులు అవగాహన కల్పించారు. లింగపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చిన టోల్ఫ్రీ నంబర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు. 112 ద్వారా అత్యవసర పోలీసు, అగ్నిమాపక, వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. 181 మహిళల రక్షణ, సహాయం కోసం, 1098 బాలల సంరక్షణ కోసం, 1930 సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగించుకోవాలని వివరించారు.
రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విద్యార్థులకు తెలిపారు. తాము తెలుసుకున్న విషయాలను ఇంట్లోని పెద్దలు, చుట్టుపక్కల వారికి తెలియజేసి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.