మైనర్ బాలికపై అఘాయిత్య కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష – కడప పోక్సో కోర్టు తీర్పు
మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, బ్లాక్మెయిల్కు పాల్పడిన కేసులో నిందితుడికి కడప రాజశ్రీ పోక్సో కోర్టు 5 సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు ₹1,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది.
కేసు వివరాలు:
కడప నగరంలోని జియాన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆవరణలో నివాసముంటున్న కొప్పేర్ల రోడా మెర్సీ కుమార్తె (మైనర్ బాలిక)పై, అదే విద్యాసంస్థలో టీచర్గా పనిచేస్తున్న వడిషా వెంకటేశ్వర్లు (42, తండ్రి: కేశవయ్య, నివాసం: నాగరాజుపేట, కడప) కన్నేశాడు. 07-04-2023 సాయంత్రం 4:30 గంటల సమయంలో బాలిక తల్లి ఇంట్లో లేని సమయాన్ని గమనించి, నివాస ప్రాంగణంలోని వర్కర్స్ గది వద్దకు బాలికను మాట్లాడాలని పిలిచాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో బాలికను బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, వాటిని చూపిస్తూ అప్పుడప్పుడు బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలిపింది. అనంతరం కడప I-టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తు:
ఫిర్యాదు ఆధారంగా అప్పటి కడప I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు (Crime No. 139/2023, IPC 354(D), POCSO Act సెక్షన్లు 7, 8, 11, 12). దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
న్యాయస్థానం తీర్పు:
కడప రాజశ్రీ పోక్సో కోర్టు న్యాయమూర్తి M.A. సోమశేఖర్ కేసును విచారించి, సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువైనట్లు తేల్చారు. దీంతో నిందితుడికి 5 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, ₹1,000 జరిమానా విధించారు.
పోలీసులకు ప్రశంసలు:
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన పీపీ K. వేణుగోపాల్, సాక్షులను సమయానికి కోర్టులో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు మానిటరింగ్ సెల్ ASI నాగేంద్ర, కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ప్రస్తుత సీఐ చిన్న పెద్దయ్య పనితీరును ఎస్పీ ప్రశంసించారు.