మధిరలో ఈ విద్యా సంవత్సరంలోనే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల తరగతులు ప్రారంభం
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను జేఎన్టీయూ అధికార బృందం శనివారం సందర్శించి, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక వసతులను పరిశీలించింది.
ఈ సందర్భంగా ఎస్బీటీఈటీ కార్యదర్శి పుల్లయ్య, జేఎన్టీయూ మందని ప్రిన్సిపాల్ డా. విష్ణువర్ధన్, జేఎన్టీయూ సభ్యులు, మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె. సాంబయ్య, జనరల్ హెడ్ వినోద్ కుమార్ కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, ల్యాబ్లు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం అధికారులు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచే మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో బీటెక్ తొలి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పాలిటెక్నిక్ కళాశాలలోనే తాత్కాలికంగా ఇంజనీరింగ్ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సూరంశెట్టి కిషోర్, షేక్ జహంగీర్ జేఎన్టీయూ అధికారులను కలిసి, మధిరలో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.