మంచిర్యాలలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత: ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేత విజిత్ కుమార్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మార్కెట్ ఏరియాలో మున్సిపల్ అధికారులు, పోలీసులు అకస్మాత్తుగా చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్య చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారని మల్లేశ్ అనే స్థానిక వ్యాపారి కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఏళ్లుగా అదే స్థలంలో వ్యాపారం చేసుకుంటూ పొట్టతిప్పలు పడుతున్నామని, స్థల యజమాని అనుమతి ఉన్నప్పటికీ తమ జీవనాధారాన్ని దెబ్బతీశారని, ఈ ప్రక్రియలో లక్షలాది రూపాయల విలువైన సామాగ్రి నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే తమను ఆదుకోవాలని కోరారు.
మరోవైపు ఈ అకస్మాత్తు కూల్చివేతలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రోద్బలంతోనే అధికారులు ఈ అనాలోచిత చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన ఆయన, సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, బాధితుల పక్షాన అవసరమైతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని విజిత్ కుమార్ అధికారులను హెచ్చరించారు