మున్సిపల్ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ చేయాలి: సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్కు సీఐటీయు నాయకుల వినతి
కార్మికులపై అధికారుల పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మికులు నిత్యం కష్టపడి పని చేస్తున్నప్పటికీ, అధికారులు ఇంకా అదనపు పని చేయాలంటూ వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్మికుల ప్రాణాలకు రక్షణగా వారందరికీ తక్షణమే ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, అలాగే వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సబ్బులు, నూనె, చెప్పులు, బెల్లం వంటివి క్రమం తప్పకుండా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పని ఒత్తిడిని తగ్గించి కార్మికుల సంక్షేమానికి అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి సాంబారి వెంకటస్వామి, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్, దేవవరం, నాయకులు రాజయ్య, తిరుపతి, రమేష్, సుధాకర్, కుమార్, పోశం, మల్లేష్, శ్రీను, రామస్వామి, వి. కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు