మంగళగిరిలో జనసేన రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం....
మంగళగిరిలో జనసేన రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం.. గంపలగూడెం నాయకుడికి ఘన సన్మానం
మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందించిన సూచనలు, మార్గదర్శకాలను నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న పలువురు నాయకులను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు రామిశెట్టి శ్రీరామ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ నూతన వస్త్రాలు కప్పి సత్కరించారు.
కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలోని జనసేన పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.