పెనుగొలనులో ఘనంగా క్షేత్రయ్య జయంతి వేడుకలు
పెనుగొలనులో ఘనంగా క్షేత్రయ్య జయంతి వేడుకలు పద కవితా పితామహుడికి ఘన నివాళులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ప్రముఖ వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు మువ్వ క్షేత్రయ్య జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్షేత్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన క్షేత్రయ్య కృష్ణాజిల్లా మువ్వ గ్రామంలో జన్మించారని, ఆయన అసలు పేరు వరదయ్య అని తెలిపారు. మువ్వ గ్రామంలోని గోపాలస్వామిపై ఉన్న భక్తితోనే ఆయన తన రచనల్లో ‘మువ్వగోపాల’ అనే ముద్రను ఉపయోగించారని వివరించారు.
భగవంతుడిని ప్రియుడిగా భావించి జీవాత్మ, పరమాత్మల కలయికను కోరుకునే మధుర భక్తి భావంతో క్షేత్రయ్య అనేక పదాలు రచించారని కొనియాడారు. ఆయన జీవితకాలంలో సుమారు నాలుగు వేలకుపైగా పదాలు రచించగా, ప్రస్తుతం దాదాపు నాలుగు వందల పదాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శనలు, కర్ణాటక సంగీత కచేరీల్లో నేటికీ క్షేత్రయ్య పదాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తెలుగు సాహిత్య, సంగీత రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, ముక్కెర నరసింహారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.