మంత్రి పార్థసారధి స్పూర్తితో మెగా పీటీఎం–4.0లో విద్యార్థులకు నగదు బహుమతుల ప్రకటన చేసిన నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము
ఏలూరు జిల్లా, చాట్రాయి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమంలో భాగంగా చాట్రాయి మండలం చనుబండ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము పాల్గొని ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారని, విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
అలాగే గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత మూడు నెలలుగా నూజివీడు నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
అదే స్ఫూర్తితో చనుబండ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో తొలి మూడు స్థానాలు సాధించే విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తొలి బహుమతిగా రూ.5,000, రెండో బహుమతిగా రూ.4,000, మూడో బహుమతిగా రూ.3,000 నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఏడు తరాల పేదరికాన్ని చదువుతోనే రూపుమాపవచ్చని పేర్కొన్న నక్కా రాము, ప్రతి తల్లిదండ్రులు వారానికి కనీసం ఒకరోజు తమ పిల్లల చదువు, స్నేహితులు, వారికి ఆసక్తి ఉన్న విషయాలను తెలుసుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, పాఠశాల కమిటీ ఛైర్మన్ బన్నే వీరయ్య, బీజేపీ జిల్లా నాయకుడు నెక్కలపు వెంకటేశ్వరరావు, మోరంపూడి రమేష్, మోదుగు ముత్తయ్య, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.