మృతురాలిగా ప్రకటించారు.. అంబులెన్స్ కుదుపుతో కళ్లుతెరిచిన మహిళ..! కైకలూరులో సంచలన ఘటన
ఏలూరు జిల్లా, జూలై 31: సాధారణంగా రోడ్లపై ఉన్న గుంతలు ప్రమాదాలకు, ప్రాణనష్టాలకు కారణమవుతుంటాయి. కానీ ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకున్న ఓ ఘటన మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రాణాలు తీస్తాయని విమర్శలు ఎదుర్కొంటున్న రోడ్డు గుంతే ఓ మహిళ జీవితంలో అనూహ్య మలుపు తీసుకొచ్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామతులసి (48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఫలించకపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న ఓ భారీ గుంతలో అంబులెన్స్ ఒక్కసారిగా బలంగా కుదుపునకు గురైంది.
ఆ కుదుపు అనంతరం రామతులసి శరీరంలో స్వల్ప కదలికలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అంబులెన్స్ను తిరిగి సమీప ఆస్పత్రికి మళ్లించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందించి ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు సమాచారం.
ఈ అరుదైన ఘటన కైకలూరు పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. నిత్యం రోడ్లపై గుంతల కారణంగా ప్రమాదాలు, ప్రాణనష్టాల వార్తలే వినిపిస్తుంటే, ఈసారి అదే గుంత అనుకోకుండా ఓ మహిళలో జీవం చిగురింపజేసిందంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వైద్యపరమైన వివరాలు, ఆమె పరిస్థితిపై అధికారిక స్పష్టీకరణ రావాల్సి ఉంది.