నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. పింఛన్ పంపిణీ నుంచి భారీ పెట్టుబడుల దాకా కీలక కార్యక్రమాలు
అమరావతి, జులై 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరులో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. అనంతరం పున్నపువారిపాలెంలో ఓ లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు. అలాగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం తిరుపతికి చేరుకోనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, అక్కడ హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4 వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.