పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడిలో ధర్నా
చింతలపూడి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడిలో ఉధృత నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయ రాజు ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా కంభం విజయ రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపిందని విమర్శించారు.
ఇంధన ధరల పెంపు వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు అమాంతం పెరగడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. పెరిగిన ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతూ ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధం, నాలుగు మండలాల వైసీపీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.