పిఠాపురం వర్మకు చంద్రబాబు పిలుపు.. అమరావతిలో కీలక భేటీ
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు రావడంతో ఆయన అమరావతికి వెళ్లారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి వర్మ ముఖ్యమంత్రిని కలిశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల ఎంపిక అంశంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో వర్మను చంద్రబాబు పిలిపించి మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే పదవుల విషయంలో పార్టీ అధినేత నిర్ణయమే తనకు ముఖ్యమని వర్మ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచనలు, ఆదేశాలను గౌరవిస్తానంటూ వర్మ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు.
పిఠాపురం రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న వర్మకు భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.