పల్స్ పోలియోకు దెందులూరులో భారీ ప్రచారం.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరు జిల్లా, దెందులూరు: జూన్ 28న నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు జనసేన ఇన్చార్జ్, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా పోలియో శిబిరాలను ఏర్పాటు చేసి, కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. జూన్ 28న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారత లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.