పోతనపల్లి పెద్ద తండాలో ఎక్సైజ్ దాడులు.. 5 లీటర్ల నాటుసారా స్వాధీనం
పోతనపల్లి పెద్ద తండాలో ఎక్సైజ్ దాడులు.. 5 లీటర్ల నాటుసారా స్వాధీనం
నాటుసారా సరఫరా చేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు.. “నవోదయం 2.0”లో భాగంగా తనిఖీలు ముమ్మరం
నూజివీడు:
నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన “నవోదయం 2.0” కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.
ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కే. నాగ ప్రభు కుమార్, ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎ. అవులయ్య ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వై.వి.ఎన్.ఎస్. ఫణి కుమార్, సిబ్బంది చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాకు చెందిన భరోతు బిక్షాలు, తండ్రి గోపాల్ వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారా, ఒక బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని విచారించగా, తాను స్వాధీనం చేసుకున్న నాటుసారాను చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన పరిసల భూపతమ్మ, భర్త రామారావుకు సరఫరా చేస్తున్నట్లు, అలాగే నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాకు చెందిన బానోతు విజయ్ కుమార్, తండ్రి రామారావు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు.
దీంతో వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వ్యక్తులు, నాటుసారా తయారు చేసే వారు, విక్రయించే వారు, కలిగి ఉన్నవారు, నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా సరఫరా చేసే వ్యాపారులు, అలాగే నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను తమ భూముల్లో కలిగి ఉండే భూ యజమానులపై కూడా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలు మరియు రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 9440902462కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.