ప్రజా సమస్యలపై ఎస్పీ బిందు మాధవ్ సత్వర చర్యల ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 49 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మొత్తం 49 ఫిర్యాదులను స్వీకరించారు.
స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించినవి 11, కుటుంబ కలహాలకు సంబంధించినవి 19 కాగా, ఇతర విభాగాలకు చెందినవి 19గా గుర్తించబడ్డాయి.
ఈ సందర్భంగా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 7 రోజుల లోపు విచారణ పూర్తి చేసి, తగిన పరిష్కారం చూపుతూ పూర్తి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.
ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జి. బిందు మాధవ్, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు.
– జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ