ప్రజాపాలనకు ప్రత్యక్ష నిదర్శనం 'ఇందిరమ్మ ఇళ్లు': మేయర్ దర్ని మధుకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతోంది. ఇందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో లబ్ధిదారులైన కటకం రజిత-సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల నగర మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విచ్చేసిన మేయర్ గారిని లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు ఎంత వేగంగా చేరుతాయో చెప్పడానికి పూర్తి కావస్తున్న ఈ ఇందిరమ్మ గృహాలే ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సహకారం, అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అధ్యక్షులు గోపతి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు