సీఐటీయు నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు నేతలపై బహిష్కరణ వేటు
వేరొక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినందుకే చర్యలు
వారితో సీఐటీయుకు ఎలాంటి సంబంధం లేదు
జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శుల ప్రకటన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో బుధవారం సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. సంఘం నిర్మాణ పద్ధతులకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురు నాయకులను సీఐటీయు నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులైన సంకె రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాసిపేట రాజేశం, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గట్టు మహేందర్ ఇటీవల వేరొక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని, అందులో కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు పత్రికల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది సీఐటీయు పని పద్ధతులకు పూర్తిగా విరుద్ధం కావడంతో జిల్లా కమిటీ నిర్ణయం మేరకు వారిపై బహిష్కరణ వేటు వేశామని స్పష్టం చేశారు.
బహిష్కరణకు గురైన ఈ ఐదుగురు నాయకులతో నేటి నుంచి సీఐటీయుకు ఎలాంటి సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని సీఐటీయులో ఉన్న కార్మికులు, అనుబంధ యూనియన్లు, జిల్లాలోని ఇతర కార్మిక సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు గమనించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షురాలు సమ్మక్క, జిల్లా సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, భానుమతి, జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రకాష్, సి. దేవదాసు, ఏ. లక్ష్మణ్, ఏ. మౌలాలి, డి. రాజారాం తదితరులు పాల్గొన్నారు