ఏపీలో ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం
అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.31 లక్షల మంది సిబ్బందిని సేవలకు సిద్ధం చేశారు.
చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, అవసరమైన 68.67 లక్షల వ్యాక్సిన్ మోతాదులను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది.