ప్రసన్నయ్యగారిపల్లిలో గడపగడపకు టీడీపీకు శ్రీకారం
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇంటింటా ప్రజలను కలవాలని పిలుపు
పుంగనూరు | Ntoday News
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రసన్నయ్యగారిపల్లి గ్రామంలో ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ప్రసన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గ్రామస్తులు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
అనంతరం ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమానికి సంబంధించిన లోగోను వై. మధుసూదన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో మోపురి మోహన్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.