రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మతసామరస్యాన్ని పెంపొందించేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషికి గుర్తింపుగా దేశవ్యాప్తంగా ఆయన జయంతిని "సద్భావనా దివాస్"గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో సమాచార సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ పునాదులు వేశారని, ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు.
రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న మహారాష్ట్రలోని బొంబాయిలో ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ దంపతులకు జన్మించారని తెలిపారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఎల్టీటీఈకి చెందిన మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్. రాంబాబు, టి. నాగశ్రీ, డి. మమత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.