రావికంపాడు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు
రావికంపాడు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు
చదువుపై ఏకాగ్రతతో దృష్టి పెడితే భవిష్యత్తు ఉజ్వలమని సూచించిన పోలీసులు
రావికంపాడు, ఆగస్టు 29: విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, మహిళలు, విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించేందుకు రావికంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచనల మేరకు, ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాష్ పర్యవేక్షణలో తడికలపూడి మహిళా ఎస్ఐ వల్లి పద్మ, పోలీస్ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సమాజంలో రక్షణ కల్పించే నూతన చట్టాలు, వాటి అమలు విధానం గురించి వివరించారు. మహిళలు, విద్యార్థుల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర సమయాల్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు, డయల్ 112, 181 సేవలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు.
విద్యార్థులు జీవితంలో కీలకమైన తొలి 20 సంవత్సరాలను కష్టపడి చదువుకు అంకితం చేస్తే, అనంతరం వచ్చే కాలమంతా సమాజంలో గౌరవంగా జీవించవచ్చని పోలీసులు సూచించారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత ఎంతో అవసరమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, చెడు వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు పోలీసులు సమాధానాలు ఇచ్చారు.