సిద్దిపేట: కరెంట్ కట్కట్.. రైతుల కష్టాలు రెట్టింపు
సిద్దిపేట: కరెంట్ కట్కట్.. రైతుల కష్టాలు రెట్టింపు
వ్యవసాయానికి 10 నుంచి 12 గంటలే విద్యుత్ సరఫరా
24 గంటల ఉచిత విద్యుత్ హామీ అమలేది? రైతుల ఆవేదన
అప్రకటిత కోతలతో మోటర్లు కాలిపోతున్న వైనం
సిద్దిపేట, ఆగస్టు 20: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలకు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పంటలకు నీరందించేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
సిద్దిపేట మండలం రాఘవాపూర్ విద్యుత్ సబ్స్టేషన్ను ఈనెల 5న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్స్టేషన్ లాగ్ బుక్ను పరిశీలించగా వ్యవసాయ రంగానికి కేవలం 10 గంటల విద్యుత్ సరఫరా మాత్రమే నమోదైనట్లు గుర్తించారు. రోజుకు సగటున 10 నుంచి 12 గంటలకే సరఫరా పరిమితమవుతోందని, వచ్చిన విద్యుత్ కూడా తరచూ ట్రిప్ అవుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనూ ఈనెల 4న విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు, అఖిలపక్ష నాయకులు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అప్రకటిత కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కన్నపేట మండలంతో పాటు సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ సమస్యలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. వర్షాలు సకాలంలో లేకపోతే బోర్లు, బావులు, వ్యవసాయ మోటర్లే రైతులకు ఆధారం. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పంటలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాల్సి రావడంతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 1,73,530, మెదక్ జిల్లాలో 1,09,152, సంగారెడ్డి జిల్లాలో 1,06,061 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం కనీసం 10 గంటలు కూడా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ వచ్చిన సమయంలోనూ తరచూ ట్రిప్పింగ్, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, ఆకస్మిక సరఫరా నిలిపివేతతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరమ్మతుల కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని చెబుతున్నారు.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగిన సమయంలో విద్యుత్ సమస్యలు మరింత భారంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.