సిద్దిపేటలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా....
సిద్దిపేటలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా.. వాట్సాప్ లొకేషన్లతో హైటెక్ అక్రమ రవాణా
మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ.. ఇదే అదునుగా దళారుల దోపిడీ
రీసైక్లింగ్ పేరుతో మిల్లుల్లోకి చేరుతున్న పీడీఎస్ బియ్యం
చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆగని అక్రమ వ్యాపారం
సిద్దిపేట: పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయడం దళారులకు కలిసి వస్తోంది. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరిస్తూ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం సరికొత్త పంథాలో సాగుతున్నట్లు సమాచారం. ఏజెంట్లు సేకరించిన బియ్యాన్ని ఎక్కడికి తీసుకురావాలి, ఎక్కడి నుంచి పెద్ద వాహనాల్లో తరలించాలి అనే వివరాలను వాట్సాప్ ద్వారా లొకేషన్లు షేర్ చేసుకుంటూ దళారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వాహనాల్లో సేకరించిన బియ్యాన్ని పెద్ద వాహనాల్లో మిల్లులకు తరలించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో భారీగా రేషన్ పంపిణీ
సిద్దిపేట జిల్లాలో 3,36,869 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులతో కలిపి మొత్తం 10,48,536 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా పరిధిలోని 685 రేషన్ దుకాణాల ద్వారా సాధారణంగా ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు.
ప్రస్తుతం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన కోటాను కలిపి ఒక్కొక్క లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 19,957 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సుమారు సగం మేర పంపిణీ పూర్తయినట్లు సమాచారం. ఇదే సమయంలో అక్రమార్కులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
మిల్లుల్లో రీసైక్లింగ్ ఆరోపణలు
కొన్ని రైస్ మిల్లుల్లో పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సీఎంఆర్ కింద అందించిన ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించి, తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లుల ద్వారా తిరిగి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పీడీఎస్ బియ్యాన్ని కొత్త బస్తాల్లో నింపి ఎఫ్సీఐకి అప్పగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టుబడింది కొంత.. తరలిపోతుంది మరింత
సిద్దిపేట పట్టణ శివారులో డీసీఎంలో తరలిస్తున్న 245 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 113.70 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది.
అదేవిధంగా గతంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు రైస్ మిల్లుల్లో పీడీఎస్ బియ్యం నిల్వలు బయటపడ్డాయి. రాయపోల్ మండలం రామారం గ్రామంలోని ఓ రైస్ మిల్లులో 1100 క్వింటాళ్ల పీడీఎస్ సన్న బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన కూడా ఉంది.
అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు?
రేషన్ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దందా కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. పలుమార్లు దాడులు జరిగినా అక్రమ రవాణా ఆగకపోవడంతో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లేవీ ముసుగులో సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి, దళారులు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.