సన్న రకం వరి, జనపనార సాగుపై రైతులు దృష్టి పెట్టాలి : వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి
తెలంగాణ రాష్ట్రంలోని రైతులు దొడ్డు రకం వరి సాగును తగ్గించి, సన్న రకాల వైపు మళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి కోరారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన విత్తనాలు, నానో ఎరువుల కౌంటర్లను పరిశీలించారు. రైతులకు ఒకే చోట సన్న రకం వరి, అపరాలు, నూనె గింజల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డిఏపి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ప్రభుత్వం సూచించిన 7 రకాలకే రూ.500 బోనస్
ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక బోనస్ కేవలం ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్న వరి పంటలకే వర్తిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బిపిటి, 5204, ఆర్ఎన్ఆర్,, 15048, హెచ్ఎంటి సోనా, కె ఎన్ ఎం 1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూ జి ఎల్ 44, మరియు జై శ్రీరామ బోనస్ అందుతుందని తెలిపారు చిట్యాల మండలంలో ఇప్పటికే 100 ఎకరాలకు పైగా జనపనార సాగు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. రైతులు పండించిన జనపనారను ' అన్యధా క్రాప్స్’ అనే సంస్థ నేరుగా కొనుగోలు చేస్తుందని, కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా సాగు చేయవచ్చని భరోసా ఇచ్చారు. అనంతరం, పెద్దకాపర్తి గ్రామంలో డ్రమ్ సీడర్ ద్వారా జనపనార విత్తనాలు వేసే ఆధునిక విధానాన్ని డైరెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు సాంప్రదాయ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని కాపాడే నానో ఎరువులను వాడాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయేందర్ రెడ్డి, ఎంఏఓ గిరిబాబు, ఏఈఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.