మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం అనుముల రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్లో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పనుల పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన సమావేశంలో మూసీ రివర్బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులో అవసరమైన చోట భూసేకరణ చేపట్టాల్సి వస్తే, భూ యజమానుల ఆసక్తిని బట్టి టీడీఆర్ ఇవ్వడం లేదా తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం "మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్" ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మూసీ ప్రాజెక్టు కింద చేపట్టబోయే పనులు, ప్రాజెక్టు విశేషాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ఈ కేంద్రంలో ప్రదర్శించాలన్నారు.
ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేముల నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులు మూసీ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన పురోగతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ను సమావేశంలో ప్రదర్శించారు.